యాదగిరిగుట్టలో సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్లో గందరగోళం..యాగశాలకు బదులు,.. టెంపుల్ సిటీలో ల్యాండింగ్
యాదాద్రి, వెలుగు: యాదగిరిగుట్టలో వేదపాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్రెడ్డి వచ్చిన హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలో గందరగోళం ఏర్పడింది. హెలికాప్టర్ను యాగశాలలోని హెలీప్యాడ్ వద్ద ల్యాండ్ చేయాలని ముందుగా నిర్ణయించుకొని, అక్కడే పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎంకు స్వాగతం పలికేందుకు కలెక్టర్ సహా ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులంతా అక్కడే వేచి ఉన్నారు.
కానీ గుట్టకు వచ్చిన హెలికాప్టర్ యాగశాలలో కాకుండా.. చివరి నిమిషంలో టెంపుల్ సిటీలోని హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయింది. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ఆఫీసర్లు, పోలీసులు, నాయకులంతా గందరగోళానికి గురయ్యారు. కనీస తనిఖీలు, ఎలాంటి భద్రత లేని టెంపుల్ సిటీ హెలిప్యాడ్ వద్ద సీఎం హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో అటు అధికారులు, ఇటు పోలీసులు టెన్షన్పడ్డారు. మారిన షెడ్యూల్.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 8.30 గంటలకు యాదగిరిగుట్టలోని యాగశాల వద్ద హెలిప్యాడ్పై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ కావాలి. ఆ మేరకు ఎస్పీ అక్షాంక్ష్యాదవ్ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.
సీఎం భద్రతను పర్యవేక్షించే అడ్వాన్స్ సెక్యూరిటీ లైన్స్(ఏఎస్ఎల్) సైతం యాగశాల హెలిప్యాడ్ వద్దే ఉంది. సీఎం యాగశాలలో ల్యాండ్ అయిన అనంతరం కొండపైకి చేరుకొని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలి. ఆ తర్వాతే రోడ్డు మార్గంలో టెంపుల్ సిటీకి వెళ్లి వేద పాఠశాలసహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలి. కానీ హెలికాప్టర్ టెంపుల్ సిటీలో ల్యాండ్ కావడంతో టూర్ షెడ్యూల్ మొత్తం మారిపోయింది. యాగశాల వద్ద సీఎం రేవంత్రెడ్డికి స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతిసహా అధికారులంతా నివ్వెరపోయారు.