‘ది బ్లఫ్’పై మహేశ్ రివ్యూ.. ‘వారణాసి’ అప్డేట్ ఇచ్చిన ప్రియాంక
ఇంటర్నెట్ డెస్క్: ప్రియాంక చోప్రా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై ఆదరణను సొంతం చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా నటుడు మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. ప్రియంక చాలా బాగా చేసిందని ప్రశంసించారు.
‘‘ది బ్లఫ్.. యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఉన్న సినిమా. ప్రియాంక (Priyanka Chopra) అదరగొట్టింది. అద్భుతమైన నటనతో అన్ని సన్నివేశాల్లో బాగా నటించింది. ఈ చిత్రంలో భాగమైన వారందరికీ నా అభినందనలు’’ అని మహేశ్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. దీనికి ప్రియాంక స్పందిస్తూ పెట్టిన రిప్లై అందరినీ ఆకట్టుకుంటోంది. థాంక్యూ మై ఫ్రెండ్.. అని మహేశ్కు రిప్లై పెట్టిన ఆమె.. త్వరలోనే అంటార్కిటికాలో కలుద్దాం అన్నారు. దీంతో ‘వారణాసి’ తర్వాత షెడ్యూల్ అక్కడ జరగనుందని అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు (Varanasi Update). చాలా రోజుల తర్వాత ‘వారణాసి’ అప్డేట్ వచ్చిందని సంబర పడుతున్నారు.
‘ది బ్లఫ్’పై దిగ్గజ దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) కూడా పోస్ట్ పెట్టారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ‘‘వెంటవెంటనే హావభావాలు మార్చే సన్నివేశాల్లో గొప్పగా నటించడం కొంతమంది హీరోయిన్స్కు మాత్రమే సాధ్యం. ప్రియాంక అలాంటివారిలో ముందుంటారు. ‘ది బ్లఫ్’ ఆమె ప్రతిభకు మరొక నిదర్శనం. ఇందులో చాలా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. పూర్తిగా ఆస్వాదించాను’’ అని రాజమౌళి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ‘వారణాసి’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అందులో మందాకిని పాత్రలో ప్రియాంక నటిస్తున్నారు. దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.