Israel-US Conflict with Iran: ఇరాన్ తో యుద్ధం.. అమెరికా, ఇజ్రాయెల్ ఎవరికి ఎక్కువ లాభం?
Israel-US Conflict with Iran: ఇరాన్ పై ఇజ్రాయేల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తో పాటు దాదాపుగా 40 మంది అగ్ర నాయకులను మట్టు పెట్టాయి. ఇరాన్ ప్రస్తుతం యుద్ధంతో అతలాకుతలం అయిపోయింది. ఇరాన్ పై యుద్ధం విషయంలో ప్రపంచ దేశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఏ దేశమూ కూడా నేరుగా ఇరాన్ కు మద్దతుగా ముందుకు రాలేదు సరికదా.. కనీసం మాట్లాడలేదు. ఖమేనీ తరువాత ఇరాన్ లో ఎవరి పాలన వస్తుంది అనేది ఇంకా స్పష్టత లేదు. తాత్కాలికంగా అయతొల్లా అలిరెజా అరాఫీ ఇరాన్ సుప్రీం లీడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ యుద్ధం వలన ఎవరికి ఎక్కువ లాభం ఉంటుంది అనే ప్రశ్న రావడం సహజం. ఇరాన్ పై తీవ్ర శత్రుత్వం ఉన్న ఇజ్రాయేల్.. అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధంలో విజయం సాధిస్తే ఏ దేశానికి ఎక్కువ ప్రయోజనం అనే విషయాన్నీ పరిశీలిస్తే రెండు దేశాలకూ అనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే..
ఇరాన్తో అమెరికా సంబంధాలు మెరుగుపడితే, ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో బలమైన పట్టు సాధించే అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం, ఇజ్రాయెల్ అమెరికా ఆర్థిక, సైనిక సహాయం పొందుతున్న అతిపెద్ద దేశం.
ఇక ఖమేనీ తర్వాత ఇరాన్లో వచ్చే కొత్త పాలన అమెరికాకు కూడా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. మధ్యప్రాచ్యంలో, ఖతార్, ఇరాక్, సిరియా, జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలలో అమెరికా సైనిక స్థావరాలను నిర్వహిస్తూ వస్తోంది.
ఇరాన్ నియంత్రణలో ఉన్న ఎర్ర సముద్ర మార్గాల ద్వారా అమెరికా చమురు, ఇతర వస్తువుల వ్యాపారం చేస్తుంది. అమెరికాకు స్థావరం లేని ఏకైక దేశం ఇరాన్. ఇరాన్లో అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే, మొత్తం మధ్యప్రాచ్యంపై నియంత్రణ సాధించడానికి వీలవుతుంది.
అంటే, ఇజ్రాయేల్ ను సమర్ధించి.. సహకరించడం ద్వారా అమెరికా తన సైనిక ప్రాబల్యాన్ని మధ్య ప్రాచ్యంలో పెంచుకుంటుంది. అమెరికా సహకారంతో ఇరాన్ ను కట్టడి చేయడం ద్వారా ఇజ్రాయేల్ ఈ ప్రాంతంలో తన ఆధిక్యాన్ని పెంచుకోగలుగుతుంది. పరస్పరం ఈ యుద్ధం ద్వారా లాభం పొందే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ ప్రయోజనం అమెరికాకే అనడంలో సందేహం అక్కర్లేదు అనేది నిపుణులు చెబుతున్న మాట.