సౌదీలోని అతిపెద్ద రిఫైనరీపై డ్రోన్ దాడి.. చమురు ఉత్పత్తిపై ఎఫెక్ట్
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తాజాగా సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో (Saudi Aramco) రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. రాస్ తనురాలోని ఈ రిఫైనరీపై ఇరాన్ షాహెద్-136 డ్రోన్తో దాడి (Iran Drone Attack) చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
దాడి కారణంగా చమురుశుద్ధి కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఘటన నేపథ్యంలో రిఫైనరీని తాత్కాలికంగా మూసివేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని సమాచారం. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు.
ఇప్పటికే యుద్ధం కారణంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో ధరలు 10 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 80 డాలర్లు దాటింది. ఇప్పుడు తాజా దాడులతో ఈ ధర మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఈ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. కువైట్లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి జరగ్గా.. దుబాయ్, దోహా, అబుదాబి, జెరూసలెంలోనూ ఈ ఉదయం పేలుడు శబ్దాలు వినిపించాయి.