IMD Summer Alert: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ 'రెడ్' అలర్ట్: ఈసారి నిప్పులు చెరగనున్న భానుడు..!
IMD Summer Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఏడాది కఠినమైన వేసవికి సిద్ధం కావాలని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. మార్చి నుంచి మే వరకు (MAM సీజన్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉండనుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు.
నిప్పులు చెరగనున్న ఉత్తర తెలంగాణ:
తెలంగాణలోని ఉత్తర జిల్లాలపై సూర్యుడు ప్రతాపం చూపనున్నాడు. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల పైనే నమోదయ్యే సూచనలు ఉన్నాయి.
తమిళనాడులో పరిస్థితి:
పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ ఎండలు మండిపోనున్నాయి. అయితే, కోమరిన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పశ్చిమ కనుమల జిల్లాల్లో రాబోయే 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అక్కడ కాస్త ఉపశమనం లభించనుంది.