హర్ముజ్ జలసంధి మూసివేత.. సంక్షోభంతో భారత్లో ముడిచమురు ధరలకు రెక్కలు!
ముడిచమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత్ పై దీని ప్రభావం అధికంగా ఉంటుంది.
Strait of Hormuz Crisis | అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముడి చమురు ధరలపై ప్రభావం చూపుతోంది. ఇటీవల క్రూడాయిల్ ధర దాదాపు 12 శాతం పెరిగింది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం హర్ముజ్ జలసంధిని మూసివేసింది. ఈ మార్గంలో ఏమైనా నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే పేల్చివేస్తాం.. వాటికి నిప్పు పెడతామని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది. హర్ముజ్ జలసంధి మార్గంలోకి వచ్చే నౌకల భరతం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకాదళ సిబ్బంది పడతారని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం సమయంలో ఇరాన్ అన్నంత పని చేసేసింది.
ఈ జలమార్గం ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన చమురు సరఫరా మార్గాలలో ఒకటి, కావడంతో ఇరాన్ తమ ఆధిపత్యం చాటుకునేందుకు హర్ముజ్ జలసంధి అస్త్రాన్ని ప్రయోగించింది. దాంతో ప్రపంచంలో పలు దేశాలకు ముడి చమురు సహా ఇతర రవాణాకు ఆటంకం తలెత్తుతోంది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న హర్ముజ్ జలసంధి నుంచి ప్రపంచంలో 5వ వంతు ముడిచమురు రవాణా అవుతోంది. ఈ మార్గంపై భారత్ తో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు ఎల్పీజీ, ముడిచమురు ఎగుమతి అవుతోంది. హర్ముజ్ మూసివేతతో ముడిచమురు ధరలు పెరిగి, వాటి ప్రభావం సంబంధిత అన్ని రంగాలపై పడుతుంది.