ఇరాన్తో యుద్ధం.. తొలి ఆరు రోజుల్లో రూ.లక్ష కోట్లు ఖర్చు
ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియాలో పోరు కొనసాగుతోంది. గత 11 రోజులుగా ఇరాన్పై భీకర స్థాయిలో దాడులు చేసేందుకు అమెరికా (USA) అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు ఉపయోగిస్తోంది. ఇందుకుగాను అమెరికా తన చేతి చమురును వదిలించుకొంటున్నట్లు తెలుస్తోంది. యుద్ధం మొదలైన తొలి ఆరు రోజులకు గాను ట్రంప్ (Donald Trump) యంత్రాంగానికి 11 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.లక్ష కోట్లకు పైగా) ఖర్చయినట్లు సమాచారం.
సెనేటర్లతో జరిగిన అంతర్గత సమావేశంలో రక్షణ అధికారులు ఈ ఖర్చుకు సంబంధించిన వివరాలను తెలిపినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆరు రోజులకు 11.3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చయిందని అధికారులు అంచనా వేశారు. అయితే, ఇది ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఉండొచ్చని సెనేటర్ క్రిస్ కూన్స్ విలేకరులతో అన్నారు. మరోవైపు యుద్ధాన్ని కొనసాగించడం కోసం ట్రంప్ యంత్రాంగం అదనపు నిధుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదనపు బడ్జెట్ను కోరుతూ వైట్హౌస్ త్వరలోనే కాంగ్రెస్కు ప్రతిపాదనలు పంపనుందని కొందరు కాంగ్రెస్ సహాయకులు పేర్కొన్నారు. దాదాపు 50 బిలియన్ డాలర్ల వరకు కోరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గతనెల 28 నుంచి అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. యుద్ధం మొదలైన తొలి రెండు రోజుల్లోనే యూఎస్ 5.6 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సామగ్రిని వినియోగించినట్లు అధికారులు అంచనా వేశారు. అమెరికా రక్షణశాఖ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉండగా.. ప్రస్తుత యుద్ధం వల్ల సైనిక నిల్వలు మరింత తగ్గుతాయని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు.