KTR: రేవంతూ.. పొంగులేటి అక్రమాల్లో ఎంతున్నది నీ వంతు?
KTR: రాష్ట్ర రాజకీయాల్లో మైనింగ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థల వ్యవహారం ఇప్పుడు శాసనసభ వేదికగా పెను దుమారాన్నే రేపుతోంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలను తాము ఆధారాలతో సహా బయటపెట్టే వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా బిత్తరపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో మైనింగ్ శాఖపై జరిగిన సుదీర్ఘ చర్చలో మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలు అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. సుమారు గంటపాటు సాగిన ఈ వాడివేడి చర్చలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మంత్రి పొంగులేటి తక్షణమే తన పదవికి నైతికంగా రాజీనామా చేయాలని బీఆర్ఎస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది.
ఈ వ్యవహారంపై ఆదివారం సైతం కేటీఆర్ తన విమర్శల పదును పెంచారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు గన్పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన ఆయన, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నిరసన చేపట్టారు. కాంగ్రెస్ మంత్రుల అవినీతికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేబూని గళమెత్తారు. "పొంగులేటి కాదు.. పొంగులూటీ" అంటూ సెటైర్లు వేస్తూనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ దోపిడీలో ఎంత వాటా ఉందని సూటిగా ప్రశ్నించారు. మైనింగ్ మాఫియాకు ప్రభుత్వం అండగా నిలవడమేంటని, ఇది సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. మంత్రులపై వస్తున్న ఈ భారీ అవినీతి ఆరోపణల మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ శ్రేణులు నినదించాయి.
మైనింగ్ కుంభకోణంలో ముఖ్యమంత్రికి సైతం ప్రమేయం ఉందని, అందుకే దోషులపై చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సభలో జరిగిన చర్చ సందర్భంగా అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్తో పొంగులేటికి సంబంధం లేదని, అది కేవలం ఆయన దూరపు బంధువులదేనని ప్రభుత్వం చెబుతున్న మాటలను ఆయన కొట్టిపారేశారు. 2020 నుంచి 2022 వరకు ఆ సంస్థకు పొంగులేటే చైర్మన్గా వ్యవహరించారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తన సొంత సంస్థలకు లబ్ధి చేకూర్చడం తీవ్రమైన నేరమని ఆయన వ్యాఖ్యానించారు.