వారు మమ్మల్ని మోసం చేశారు: ట్రంప్ వ్యాఖ్యలు
ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియాలో ఘర్షణల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ ఏదోఒక పోస్టు పెడుతూనే ఉన్నారు. తాజాగా ఇరాన్ జనాభాలో పది శాతం వరకు ఉండే కుర్దుల గురించి మాట్లాడారు. వారు తనను మోసం చేశారనే అర్థంలో వ్యాఖ్యలు చేశారు.
ఈ యుద్ధానికి ముందు ఇరాన్ (Iran)లో కొన్నివారాల పాటు ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో నిరసనకారుల కోసం అమెరికా ప్రభుత్వం రహస్యంగా ఆయుధాలు పంపింది. వాటిని కుర్దుల ద్వారా ఆందోళనకారులకు చేరవేసే యత్నం చేసింది. ఈ విషయంపై ట్రంప్ ఓ అమెరికా మీడియా సంస్థతో మాట్లాడారు. ‘‘కుర్దుల ద్వారా చేరవేయాలనే ఉద్దేశంతో భారీ సంఖ్యలో తుపాకులు పంపాం. కానీ అవి నిరసనకారులకు ఇవ్వకుండా వారివద్దే ఉంచుకున్నారు అనుకుంటున్నా’’ అని ట్రంప్ అసహనం వ్యక్తంచేశారు.
ఆ సంకేతం ఇరాన్ ట్రాప్ అనుకొన్నాం: ట్రంప్
ఆర్థిక సంక్షోభం కారణంగా గత డిసెంబర్లో ఇరాన్లో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇరాన్లో ప్రభుత్వాన్ని పడగొట్టాలనే లక్ష్యంతో ఈ ఆయుధాలు అందించాలని యత్నించింది. ఇక, ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూలదోయాలని కుర్దులు ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నారు. పరాక్రమవంతులుగా వీరికి పేరుంది. సిరియాలో ఐఎస్ఐఎస్కు వ్యతిరేకంగా పోరాడేందుకు అమెరికా సైన్యమే కుర్దులకు శిక్షణ ఇచ్చింది. ఈ యుద్ధంలో వారిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకు ఫలితం దక్కలేదని తెలుస్తోంది. తొలుత ఆర్థిక సమస్యల కారణంగా ప్రజల మద్దతు కోల్పోయిన ఇరాన్ ప్రభుత్వం.. ఆ తరువాత యుద్ధం కారణంగా వారి ఆలోచన మారింది. ఇది కూడా అగ్రరాజ్యం చేసిన ప్రయత్నాలు విఫలమవడానికి ఓ కారణమైంది.