President Droupadi Murmu | భూమి పచ్చగా ఉంటేనే బతుకు పచ్చగా.. గ్రీన్ ఇండియా చాలెంజ్ సేవలు భేష్!
భూమి పచ్చగా ఉంటేనే మన బతుకులు పచ్చగా ఉంటాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపునకు గ్రీన్ ఇండియా చాలెంజ్ చేస్తున్న సేవలను కొనియాడారు. సంస్థ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ సంతోష్కుమార్ను రాష్ట్రపతి అభినందించారు. హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): భూమి పచ్చగా ఉంటేనే మన బతుకులు పచ్చగా ఉంటాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపునకు గ్రీన్ ఇండియా చాలెంజ్ చేస్తున్న సేవలను కొనియాడారు. సంస్థ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ సంతోష్కుమార్ను రాష్ట్రపతి అభినందించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం మాజీ ఎంపీ సంతోష్కుమార్ రూపొందించిన ‘వృక్ష వేదం 2.0’ పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ..
మూలపురుషుడి ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథ్వీ ఉద్భవించాయని తైత్తిరీయ ఉపనిషత్తు ప్రవచిస్తున్నదని పేర్కొన్నారు. ఈ పంచభూతాల సృష్టే మానవ జీవితం అని తెలిపారు.City & Local Guides పంచభూతాల నుంచి ఉద్భవించిన మానవుడు తిరిగి ధరిత్రిలోనే లీనమైపోతాడని అన్నారు. తిరిగి పంచభూతాల ద్వారా మరో జన్మ పొందుతాడని వివరించారు. కాబట్టి జననం, జీవనం, జీవనయానం మరణం అన్నీ ప్రకృతి ఆధారాలైన పంచభూతాలతో ముడిపడి ఉన్నందున పర్యావరణంతో మరింత మమేకమయ్యేలా మన జీవితాలను మలుచుకోవాలని రాష్ట్రపతి సూచించారు. సమస్త ధరిత్రి వృక్షమయమైనప్పుడే మనందరి జీవితాల్లో ఆనందం వెల్లి విరుస్తుందని చెప్పారు.
పర్యావరణ స్ఫూర్తి.. దేశం నలువైపులా..
మనిషి స్వార్థం, లాభాపేక్ష వీడి పంచభూతాలను బతికిస్తే ఆపదలు తొలగి మనమంతా సుభిక్షంగా ఉంటామని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ప్రకృతి సంరక్షణ కోసం సంతోష్ ఆధ్వర్యంలోని గ్రీన్ ఇండియా చాలేంజ్ చేస్తున్న వినూత్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ‘భూమి పచ్చగా ఉంటేనే బతుకు పచ్చగా ఉంటుంది..’ అని వృక్షవేదంలోని వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రత్యేకంగా ఉటంకించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు.
కేవలం 8 ఏండ్ల కాలంలోనే 19 కోట్ల మొక్కలు నాటి.. పర్యావరణ స్ఫూర్తిని దేశం నలువైపులా వ్యాపింపజేసిన సంతోష్కుమార్ అసలైన పర్యావరణ పరిరక్షకుడని రాష్ట్రపతి కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డి, పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ఇగ్నైటింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు ఎం కరుణాకర్రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు సంజీవుల రాఘవేంద్ర పాల్గొన్నారు.