కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 2 శాతం పెంపు
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరటనిస్తూ శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మోడీ ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం 2 శాతం పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత అక్టోబర్లో డీఏను 55 శాతం నుండి 58 శాతానికి పెంచగా.. తాజా నిర్ణయంతో ఇది 60 శాతానికి చేరుకోనుంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో ఈ సర్దుబాట్లు చేస్తుంది.
ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు 8వ వేతన సంఘం ఏర్పాటుపై తమ డిమాండ్లను ఉధృతం చేస్తున్న తరుణంలో ఈ డీఏ పెంపు నిర్ణయం వచ్చింది. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ప్రభుత్వం ముందు ఒక మెమోరాండం ఉంచింది. ఇందులో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.83కి పెంచాలని, దీంతో బేసిక్ వేతనాన్ని రూ.18వేల నుండి దాదాపు రూ.69వేలకు పెంచాలని కోరింది. అలాగే పే లెక్కల కోసం ఫ్యామిలీ నిర్వచనంలో ఆధారపడిన తల్లిదండ్రులను చేర్చాలని, వేతన అసమానతలను తగ్గించాలని కూడా ప్రతిపాదించింది.