ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 18న విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆగస్టు నెల కోటాను తితిదే ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన భక్తులు ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నంలోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతుంది.
23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం కోటా, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన కోటా అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదలవుతుంది. 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in/ వెబ్సైట్లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని తితిదే సూచించింది.