Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
దేశ పౌరులందరూ పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ కోరారు. ఢిల్లీలో సుజాత శర్మ మీడియాతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఇప్పటికే ప్రధాని మోడీ కోరారని.. మరోసారి కేంద్ర ప్రభుత్వం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని సుజాత శర్మ తెలిపారు. సాధ్యమైనంత వరకు మెట్రో, ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించాలని సూచించారు. అలాగే కార్పూలింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని.. సరుకు రవాణాలో రైల్వేలను ఎక్కువగా ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడ సాధ్యమైతే అక్కడ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని తెలిపారు. దేశంపై ప్రస్తుతం పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రతి పౌరుడు తన రోజువారీ జీవితంలో ఇంధన సంరక్షణకు కట్టుబడి ఉండాలని ప్రధానమంత్రి మోడీ తెలియజేశారని పేర్కొన్నారు. మనమందరం ఏకమై మన దైనందిన జీవితంలో శక్తిని పరిరక్షించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేద్దామని..
తద్వారా ప్రస్తుతం దేశంపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని సుజాత శర్మ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరల తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని పేర్కొంది. అయితే సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంధన సరఫరాను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సమర్థవంతమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా దేశంలో ముడి చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపింది. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఎక్కడా ఇంధన కొరత లేదని, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర కూడా సరఫరా లోపాలు నమోదు కాలేదని స్పష్టం చేసింది.
పెట్రోల్, డీజిల్ తగిన స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, గృహ వినియోగ ఎల్పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని వెల్లడించింది. గత మూడు రోజుల్లో 1 కోటి 14 లక్షల బుకింగ్స్కు వ్యతిరేకంగా 1 కోటి 26 లక్షల ఎల్పీజీ సిలిండర్లు గృహాలకు పంపిణీ చేసినట్లు తెలిపింది. ఇదే సమయంలో కమర్షియల్ ఎల్పీజీ విక్రయాలు 17 వేల టన్నులకు పైగా నమోదయ్యాయని పేర్కొంది. ఆటో ఎల్పీజీ విక్రయాలు కూడా 762 టన్నులను దాటినట్లు సుజాత శర్మ వెల్లడించారు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరల పెంపుపై ఆలోచనలు ప్రారంభించింది. నష్టాలను పూడ్చుకునేందుకు భారీగా ధరలు పెంచే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.