తల్లిదండ్రులకు గుడ్న్యూస్..తెలంగాణలో పాఠ్యపుస్తకాల ధరలు భారీగా తగ్గింపు!
తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ తీపి కబురు అందించింది. ఈ ఏడాది 1 నుండి 10వ తరగతి పాఠ్యపుస్తకాల (టెక్స్ట్బుక్స్) ధరలను దాదాపు 17 శాతం వరకు తగ్గించింది. నూతన టెండర్ల ప్రక్రియ ద్వారా ప్రింటింగ్ వ్యయాన్ని భారీగా తగ్గించడమే ఇందుకు ప్రధాన కారణం. గత ఏడాది ఒక్కో పేజీ ముద్రణకు 54 పైసలు ఖర్చు అవ్వగా, ఈ ఏడాది అది 44.50 పైసలకు తగ్గింది. దీని వల్ల ఒకటవ తరగతి విద్యార్థికి సంబంధించిన మూడు పుస్తకాల సెట్ ధర రూ.247 నుండి రూ.209కి తగ్గింది. అలాగే, 10వ తరగతి విద్యార్థుల టెక్స్ట్బుక్ సెట్ ధర రూ.1,078 నుండి రూ.900కి దిగివచ్చింది. ఈ నూతన ధరలతో కూడిన పాఠ్యపుస్తకాలు జూన్ 5 నుండి మార్కెట్లలోని బుక్ స్టాళ్లలో అందుబాటులోకి రానున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగానే పుస్తకాలను పంపిణీ చేస్తుంది. అయితే, ఈ ధరల తగ్గింపు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతూ ఓపెన్ మార్కెట్లో పుస్తకాలు కొనుగోలు చేసే లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులకు పెద్ద ఆర్థిక ఉపశమనం కలిగించనుంది. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రైవేట్ స్కూళ్ల పుస్తకాల ధరల భారంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం టెండర్ల నిర్వహణలో పారదర్శకత పాటించి ముద్రణా వ్యయాన్ని తగ్గించడం విశేషం. జూన్ నెలలో విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న తరుణంలో ఈ నిర్ణయం మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో లబ్ధి చేకూర్చనుంది.