ధృవతార సురవరం.. తెలంగాణ సాహిత్య శిఖరం
తెలంగాణ ప్రజల ఔన్నత్యాన్ని, దశదిశలా వ్యాపింపజేసిన ఆధునిక వైతాళికుడు, దార్శనికుడు సురవరం ప్రతాపరెడ్డి. గోలకొండ పత్రికలో ఫిరంగి మోతలతో నిజాం గుండెల్లో దడ పుట్టించిన ధిక్కారుడు.. విరామమెరుగకుండా మూడు దశాబ్దాల పాటు రచయితగా, జర్నలిస్టుగా చరిత్రను సృష్టించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య అలంపూర్ తాలూకా ఇటికెలపాడు గ్రామంలో రంగమ్మ, నారాయణరెడ్డి దంపతులకు 1896 మే 28న జన్మించారు.
మద్రాసులో వేదం వెంకటరాయశాస్త్రి వద్ద ఆయన విద్యాభ్యాసం చేశారు. హరిసర్వోత్తమరావు సంపాదకత్వంలో వెలువడిన పినాకిని, అనంతపురం నుంచి వెలువడిన ‘కళ’, రెడ్డిరాణి మాసపత్రిక, దక్షిణ భారత ప్రాంతం నుంచి వచ్చే సాహిత్య మాసపత్రికలకు విద్యార్థి దశలోనే వ్యాసాలు రాశారు. సురవరం న్యాయశాస్త్రాన్ని చదివి వకీలు వృత్తి చేపట్టినా రచయితగా, సంపాదకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. విద్యార్థి దశలోనే ‘దేశ బంధు’ హైదరాబాద్ ను కార్యక్షేత్రంగా చేసుకొని విద్యార్థి దశలోనే ‘దేశబంధు’ అనే పత్రికను స్థాపించాలని ప్రతినబూనాడు. గోలకొండ పత్రిక స్థాపక సంపాదకులుగా, ఆంద్రమహాసభ తొలి అధ్యక్షుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా, పౌరహక్కుల ఉద్యమకారుడిగా, రచయితగా, పరిశోధకుడిగా, తెలంగాణ అస్తిత్వ పతాకం 'గోలకొండ కవుల సంచిక' సంపాదకులుగా, అరుంధతీయ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించిన సామాజిక సంస్కర్త సురవరం.
సారస్వత పరిషత్, రచయితల సంఘం, గ్రంథాలయోద్యమం శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, వేమన గ్రంథాలయం ఇంకా ఎన్నో ఆయన విజ్ఞానంలోని ఒక్కొక్క ఆలోచన ఒక్కో సంస్థగా రూపొందింది. తెలంగాణలో స్థాపించిన ప్రతి సంస్థలో ఆయన చేయూత ఉంది. 'తెలంగాణలో కవులే లేరు' అన్న నిందా విమర్శకు సమాధానంగా ఉక్కు సంకల్పంతో 354 మంది తెలంగాణ కవుల పాండిత్య ప్రతాపాన్ని వివరాలతో ‘గోల్కొండ కవుల సంచిక’ను వెలువరించిన నిత్య సత్యన్వేషి. సాహిత్యానికి నిత్య స్ఫూర్తి తెలంగాణ సామాజిక చరిత్రను లోతుగా అధ్యయనం చేసి రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ గ్రంథం నేటికీ ఒక ప్రామాణికం. నేటికీ పరిశోధకులకు కరదీపిక. 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మొదటి తెలుగు గ్రంథం. హిందువుల పండుగలు భారతీయులు ముఖ్యంగా తెలుగువారి పర్వాల్ని, వ్రతాలను విశదపరుస్తుంది. పండుగల వెనుక ఉన్న పరమార్థాన్ని చారిత్రక దృష్టితో సమీక్షించారు. శాస్త్రీయ దృక్పథంతో విషయ విశ్లేషణలు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.