డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ అంశంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పేర్ని నాని ఆరోపించారు. ప్రభుత్వం మొదట క్రీడా కోటాను 3 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చిందని, ఆ తర్వాత 382 మంది ఎంపికయ్యారని చెప్పిందని, కానీ ఇటీవలే ఆటల సంఖ్యను 29 నుంచి ఏకంగా 67 కి పెంచి, అందులో ‘బ్రిడ్జ్’ను కూడా చేర్చారని విమర్శించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను గత 9 నెలలుగా ఎందుకు బహిరంగపరచడం లేదని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారి సంతకం కూడా లేకుండా ఆ లిస్ట్ను ఎలా విడుదల చేశారు? ఇప్పుడు కార్డు గేమ్స్ ఆడేవారిని ఎంపిక చేయలేదని ప్రభుత్వం ఎందుకు మాట మారుస్తోంది? అని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన భారీ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికి హోంమంత్రి అనితను ఒక కవచంలా వాడుకుంటోందని పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అరాచకాలపై నోరు మెదపని ప్రభుత్వం ప్రతిపక్షాలు డీఎస్సీ స్కామ్ను లేవనెత్తినప్పుడు మాత్రం హైపర్యాక్టివ్గా మారుతోందని ధ్వజమెత్తారు.