Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఫ్యాన్స్ కీలక ప్రకటన
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ నెల 18న ఎన్టీఆర్ నుంచి సంచలన ప్రకటన ఉంటుందనీ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల హీరోలు పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో, తారక్ ఎంట్రీ కూడా వచ్చే (2029) ఎలక్షన్లో ఉంటుందని టాక్ ఊపందుకుంది. ఈ క్రమంలోనే మీడియా వర్గాలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోషియన్స్ క్లారిటీ ఇస్తూ కీలక ప్రకటన చేశాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా తన సినిమా ప్రాజెక్టులపైనే దృష్టి సారించారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆయన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలను కేవలం ఊహాగానాలుగానే చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘాలు వెల్లడించాయి. ఇప్పుడు ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎన్టీఆర్ లేదా ఆయన టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ ప్రకటనలో క్లారిటీ ఇస్తూ..‘‘జూలై 18న ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రకటన ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న పోస్టులను మా దృష్టికి వచ్చాయి. మా సమాచారం మేరకు, అవన్నీ పూర్తిగా వదంతులు మాత్రమే. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జూలై 18న నిర్వహించనున్న ఊరువాడా కార్యక్రమాన్ని చాలా ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించాం. ఈ ఈవెంట్ ఉద్దేశం ఊరువాడ ప్రధాన ఆలోచన, లక్ష్యాన్ని ప్రజలకు పరిచయం చేయడం మాత్రమే. ప్రస్తుతం జరుగుతున్న తారక్ రాజకీయ ప్రచారాలతో ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు.
మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫారమ్లు, సోషల్ మీడియా పేజీలు ధృవీకరణ లేని లేదా అసత్య సమాచారాన్ని ప్రచారం చేయకుండా, వార్తలను ప్రచురించే లేదా పంచుకునే ముందు వాస్తవాలను నిర్ధారించాలని మనవి. దీంతో అభిమానుల్లో అనవసర గందరగోళం నెలకొనకుండా ఉంటుంది. కార్యక్రమం జరిగే వేదిక, సమయం, పూర్తి వివరాలను త్వరలోనే మా అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా వెల్లడిస్తాం. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోషియన్ క్లారిటీ ఇచ్చారు.