Afghanistan- Pakistan Conflict: ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం ప్రకటించిన పాకిస్తాన్.. ఎయిర్ స్ట్రైక్స్తో విరుచుకుపడుతున్న పాక్ ఆర్మీ
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరువైపుల దాడులు యుద్ధానికి దారితీశాయి. తాలిబన్లపై యుద్ధం మొదలైందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక ప్రకటన చేశారు.
Afghanistan-Pakistan Conflict: పాకిస్థాన్, తాలిబన్ల మధ్య రాత్రంతా భీకర దాడులు కొనసాగాయి. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులు చేసింది. పిరికిపంద పాకిస్థాన్ సైన్యం కాబూల్, కాందహార్, పక్తియాలోని కొన్ని ప్రాంతాల్లో బాంబులు కురిపించిందని తాలిబన్ ప్రతినిధి అన్నారు. దేవుడి దయ వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు. మరోవైపు, వీటన్నింటికీ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కారణమని.. తమ సహనం నశించిందని, ఇక యుద్ధం మొదలైందని పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక ప్రకటన చేశారు. ఈ వ్యవహారంలోకి భారత్ను కూడా లాగుతూ ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో (NATO) దళాలు వెళ్లిపోయిన తర్వాత అక్కడ శాంతి నెలకొంటుందని, తాలిబన్లు ఆఫ్ఘన్ ప్రజల ప్రయోజనాలు, ప్రాంతీయ స్థిరత్వంపై ఫోకస్ చేస్తారని ఆశించాం. కానీ తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను భారత్కు కాలనీగా మార్చారు. ప్రపంచం నలుమూలల నుండి ఉగ్రవాదులను ఆఫ్ఘనిస్తాన్లో చేర్చి, టెర్రరిస్టులను ఎగుమతి చేయడం ప్రారంభించారని’ ఆరోపించారు.
ఆఫ్ఘన్ ప్రభుత్వం తమ ప్రజలకు ప్రాథమిక మానవ హక్కులను నిరాకరించిందని ఖవాజా ఆసిస్ అన్నారు. ఇస్లాం మహిళలకు ఇచ్చే హక్కులను సూతం వారు లాక్కున్నారని ఆరోపించారు. పరిస్థితులను బాగుచేయడానికి పాకిస్థాన్ సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేసిందన్నారు. మేం ఎంతో దౌత్యం చేశాం, కానీ తాలిబన్ భారత్ కు ప్రాక్సీగా మారిందని, వారు చెప్పినట్లు చేస్తుందని ఆరోపించారు.