హర్మూజ్లో చమురు నౌకలకు.. అమెరికా నేవీ రక్షణ: ట్రంప్ హామీ
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. దీంతో ఇంధన రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ (Strait Of Hormuz) మీదుగా వెళ్లే చమురు ట్యాంకర్లకు అవసరమైతే అమెరికా నేవీ రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు.
వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. ప్రపంచానికి ఇంధన సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అమెరికా (USA) తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతా పోస్ట్లో రాసుకొచ్చారు. ఇక, గల్ఫ్ మీదుగా సముద్ర మార్గాల్లో జరిపే వాణిజ్యానికి ఆర్థిక భద్రత, అందుబాటు ధరల్లో బీమా, ఇతర గ్యారెంటీలన్నీ తక్షణమే అందించాలని యూఎస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ను ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు.
ఈ ప్రకటన తర్వాత చమురు మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర (Oil Prices) 73 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇటీవల ఇది 80 డాలర్లకు పైనే ట్రేడ్ అయిన సంగతి తెలిసిందే. హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నామని, ఆ దిశగా నౌకలు వస్తే నిప్పు పెడతామని ఇరాన్ నిన్న హెచ్చరించింది. దీంతో ఈ మార్గంలో చమురు రవాణా (Oil Supply) స్తంభించింది. హర్మూజ్కు అటూఇటూ వందల సంఖ్యలో నౌకలు నిలిచిపోయినట్లు మారిటైమ్ అనలిటిక్స్ సంస్థల గణాంకాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ట్రంప్ నుంచి ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.