పాక్ను సామంత దేశంగా మార్చేందుకు కుట్ర: ఖవాజా ఆసిఫ్
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతోన్న ఉద్రిక్తతల (Iran-Israel War)పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) స్పందిస్తూ.. ఇజ్రాయెల్పై తీవ్ర విమర్శలు చేశారు. అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికా-ఇజ్రాయెల్ టెహ్రాన్పై యుద్ధం ప్రకటించాయని ఆరోపించారు. ఈ యుద్ధం వల్ల పాకిస్థాన్ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా తమ సరిహద్దుల వద్ద ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నారన్నారు. అన్నివైపుల నుంచి శత్రువులు తమను చుట్టుముట్టడం వల్ల పాక్ సామంత దేశంగా మారే ప్రమాదం ఉందన్నారు.
ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తే భారత్, అఫ్గానిస్థాన్ ఏకమై.. పాక్ను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆసిఫ్ ఆందోళన వ్యక్తంచేశారు. దానివల్ల తమకే ఇబ్బందన్నారు. పాక్ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతోందని.. ఈ కుట్రలో భారత్ భాగస్వామిగా ఉందని అక్కసు వెళ్లగక్కారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామిక్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే అన్ని సంఘర్షణలలో జియోనిజం (యూదు భావజాలం) ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర పోషించిందని ఆసిఫ్ ఆరోపించారు. దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించేది జియోనిస్టులేనన్నారు. ఇదీ చదవండి: ఖమేనీ వారసుడిగా ముజ్తబా..?