జగన్, భూమన, వైవీ సుబ్బారెడ్డి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు: పంచుమర్తి అనురాధ
అమరావతి: తిరుమల శ్రీవారిపై గతంలో జగన్ ప్రభుత్వం కక్షగట్టిందని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై శాసన మండలిలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. టెండర్ నిబంధనలను సవరించి ఇష్టానుసారం వ్యవహరించారని విమర్శించారు.
‘‘అనేక భయంకరమైన రసాయనాలు కలిసి ఉన్నవాటికి ఆవు నెయ్యి అని పేరు పెట్టారు. రోజుకు 4లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను సడలించారు. నెయ్యి ఉత్పత్తిలో అనుభవాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించేశారు. టర్నోవర్ ఏడాదికి రూ.250 కోట్లు అని ఉన్న నిబంధనను రూ.150 కోట్లకు పరిమితం చేశారు. సాంకేతిక అధ్యయనం, క్షేత్రస్థాయి పరిశీలిన లేకుండా టెండర్లు కట్టబెట్టారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను నీరుగార్చేశారు. టెండర్ నిబంధనల సడలింపుపై తితిదే అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతకం చేశారు. నెయ్యి కల్తీ జరిగిందని ఎన్డీడీబీ నివేదిక ఇచ్చింది.
ఇది కుంభకోణమే కాదు.. హిందుత్వంపై దాడి. మాజీ సీఎం జగన్, తితిదే మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు’’ అని పంచుమర్తి అనురాధ అన్నారు.