Nara Lokesh: దేవుడిపై జగన్కు నమ్మకం లేదు.. అందుకే డిక్లరేషన్పై సంతకం పెట్టలేదు
Nara Lokesh: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవుడిపై అపారమైన నమ్మకం ఉన్నవారు ఎవరైనా నిబంధనలను గౌరవిస్తారని, కానీ జగన్ కనీసం డిక్లరేషన్పై సంతకం పెట్టడానికి కూడా నిరాకరించారని విమర్శించారు.
కల్తీ జరిగిందని రిపోర్టులు చెబుతున్నాయి..
చర్చలో భాగంగా లోకేష్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం మార్కెట్లో ధరలు పెరిగాయని చెప్పి, గత ప్రభుత్వం చేసినట్లు మేము కూడా కల్తీ నెయ్యిని వాడాలా? లడ్డూ తయారీలో కల్తీ జరిగిందనే వాస్తవాన్ని పక్కనపెట్టి ప్రతిపక్షం అనవసరపు మాటలు మాట్లాడుతోంది. నెయ్యి కల్తీ జరిగిందని సీబీఐ నివేదికలో సైతం స్పష్టంగా ఉంది. ఈ విషయాన్ని గత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా అంగీకరించారు" అని గుర్తు చేశారు. స్వామివారి ప్రసాదం విషయంలో తప్పు చేసిన వారిని ఆ వేంకటేశ్వర స్వామి అస్సలు వదిలిపెట్టడని ఆయన హెచ్చరించారు.
దేవుడిపై అంత కక్ష ఎందుకు?: మంత్రి అచ్చెన్నాయుడు
ఇదే అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జగన్కు వేంకటేశ్వర స్వామిపై ఏమాత్రం భక్తి లేదని విమర్శించారు. "ప్రతి ఒక్కరికీ తమ మత విశ్వాసాలు ఉంటాయి, వాటిని మేము గౌరవిస్తాం. కానీ హిందూ ధర్మం, దేవుడిపై జగన్కు అంత కక్ష ఎందుకు?" అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు.