ఇరాన్ ‘అట్రిషన్ వార్’.. శత్రువు జేబులు ఖాళీ చేస్తుందిలా...
ఈటీవీ భారత్: ఇజ్రాయెల్, అమెరికాలపై యుద్ధంలో ఇరాన్ కొత్త పంథా అవలంభిస్తోంది. తాను ఖర్చు ఎక్కువ చేయకుండానే… ప్రత్యర్థికి భారీ నష్టం కలిగిస్తోంది. శత్రువు జేబులను ఖాళీచేసి...వారిని అలసిపోయేలా చేయడమే ‘అట్రిషన్ వార్’ వ్యూహ పద్ధతి. అసలు అమెరికా, ఇజ్రాయెల్ల యుద్ధ ఖర్చులను ఇరాన్ ఎలా పెంచుతోందంటే...
చౌకైన షాహెద్ డ్రోన్లు...
అత్యాధునిక సాంకేతికతతో తయారైన ఆయుధాలు కలిగిన అమెరికా, ఇజ్రాయెల్లను ఇరాన్ చౌకైన డ్రోన్లతో ఎదుర్కొంటోంది. అవే షాహెద్-136 వన్వే అటాక్ డ్రోన్లు. ఇవి చిన్న క్రూయిజ్ మిస్సైళ్లలా పనిచేస్తాయి. లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతాయి. కాబట్టి వీటిని సూసైడ్ డ్రోన్లుగా పిలుస్తారు. ఒక్కో డ్రోన్ను తయారు చేయడానికి అయ్యే ఖర్చు సుమారు 20 వేల డాలర్లు (రూ.16 లక్షలు). ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు గల్ఫ్ దేశాలు, అమెరికా.. వినియోగిస్తున్న రక్షణ క్షిపణుల ఖర్చు మాత్రం రూ.కోట్లు దాటుతోంది. ఉదాహరణకు, ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న ఐరన్ డోమ్ వ్యవస్థలో ఒక్క క్షిపణి ధర రూ.35-45 లక్షల వరకు ఉంటుంది. విమానాల నుంచి ప్రయోగించే సైడ్వైండర్ క్షిపణుల ధర మరింత ఎక్కువ.
ఇక అమెరికా ఉపయోగిస్తున్న పేట్రియాట్ మిస్సైల్ వ్యవస్థల్లో ఒక్క ఇంటర్సెప్టర్ క్షిపణి ధర రూ.30 కోట్లకు పైగానే ఉంటుంది. అంటే రూ.16 లక్షల డ్రోన్ను కూల్చేందుకు రూ.30 కోట్ల క్షిపణి వినియోగించాల్సిన పరిస్థితి. ఈ వ్యత్యాసమే ఇప్పుడు పాశ్చాత్య దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఖరీదైన మిస్సైళ్ల నిల్వలు త్వరగా ఖాళీ కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గల్ఫ్లోని కొన్ని దేశాల్లో నిల్వలు తగ్గుతున్నాయని అంతర్గత అంచనాలు చెబుతున్నాయి. ఇరాన్ తక్కువ ఖర్చుతో వేలాది డ్రోన్లు తయారుచేసి ప్రయోగిస్తే, అమెరికా- ఇజ్రాయెల్లకు వాటిని అడ్డుకోవడం ఆర్థికంగా భారమవుతుంది. చివరకు ఆయుధాల కొరత, రాజకీయ ఒత్తిడి కారణంగా యుద్ధాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చని వారు భావిస్తున్నారు.