భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు
దిల్లీ: దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.965కి చేరింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలోనే ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ఇంధన లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి హర్దీప్సింగ్ పురి స్పందించారు. ‘‘పౌరులకు అందుబాటు ధరలో ఇంధన లభ్యత ఉండేలా చూడటం మా తొలి ప్రాధాన్యత. దేశంలో ఎలాంటి కొరతా లేదు. దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరతపై నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సమాచారాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా తోసిపుచ్చింది. ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ విషయంలో భారత్ సౌకర్యవంతమైన స్థితిలోనే ఉందని శుక్రవారం ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయి. హర్మూజ్ అంతరాయాల వేళ వేర్వేరు సోర్సుల నుంచి దేశానికి భారీ స్థాయిలో ఇంధనం లభ్యమవుతోందని పేర్కొన్నాయి.