యుద్ధం ఎఫెక్ట్తో పెట్రోల్, డీజిల్ దొరకదన్న ప్రచారంపై ఇండియన్ ఆయిల్ కీలక ప్రకటన
గల్ఫ్ దేశాలపై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో ఇండియాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని.. కొరత ఏర్పడే ప్రమాదం ఉందని జరుగుతున్న ప్రచారంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. అవన్నీ పుకార్లేనని ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది.
ఇండియాలో అవసరమైనంత ఇంధన నిల్వలు ఉన్నాయని, సప్లై, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ యధావిధిగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. అందువల్ల.. దేశ ప్రజలు పెట్రోల్, డీజిల్ విషయంలో కంగారు పడాల్సిన అవసరమే లేదని.. అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది.
భారత్ పెట్రోలియం కూడా ఈ తరహా సూచనే వాహనదారులకు చేసింది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ షార్టేజ్ ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కుండబద్ధలు కొట్టింది. ఇంధన నిల్వల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇండియాలో సరిపడినంత ఇంధన నిల్వలు ఉన్నాయని భారత్ పెట్రోలియం వెల్లడించింది. సప్లై చైన్స్ ఎలాంటి అంతరాయం లేకుండా నడుస్తున్నాయని.. BPCL పెట్రోల్ బంకుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కస్టమర్లకు ఇంధనం దొరుకుతుందని స్పష్టం చేసింది.
క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడుతుందన్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఇప్పటికే పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్కు సరిపడా చమురు నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, ప్రస్తుతానికి రిటైల్ ధరలు పెరగవని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని పేర్కొంది.
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరగడం వల్ల హైదరాబాద్ నగరంలో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వాహనదారులు సంయమనం పాటించాలని సూచించారు.