దుర్గమ్మను ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు: హోం మంత్రి అనిత
విజయవాడ కనకదుర్గమ్మను హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.
విజయవాడ, మార్చి 7: మహా కుంభాభిషేకం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను(Kanakadurgamma Temple) హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha), మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) ఈరోజు(శనివారం) దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దేవస్థానం అధికారులు. అమ్మవారి దర్శనానంతరం కంచి కామకోటి పీఠాధిపతులను హోం మంత్రి అనిత కలిశారు.
అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమ్మవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదని తెలిపారు. రేపు(ఆదివారం) ఉదయం 9 గంటలకు మహా కుంభాభిషేకం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈరోజు, రేపు అంతరాలయ దర్శనం నిలిపివేస్తారని అన్నారు. ప్రతి 12 ఏళ్లకు వచ్చే ఈ మహా కుంభాభిషేకం మహోత్సవాన్ని వీక్షించేందుకు రేపు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేక మహోత్సవాలు రెండోరోజుకు చేరుకున్నాయి. రేపు(ఆదివారం) ఉదయం 9:34 గంటలకు ప్రధాన ఘట్టమైన కుంభాభిషేకం జరుగనుంది. మహోత్సవాల్లో భాగంగా కంచి పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతి కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.