చిరుకు పవన్ కల్యాణ్ అభినందనలు.. గద్దర్ అవార్డుల్లో ఈటీవీ విన్ సత్తా
ఇంటర్నెట్ డెస్క్: అగ్ర కథానాయకుడు చిరంజీవి మరో గౌరవాన్ని అందుకోనున్నారు. తాజాగా గద్దర్ అవార్డులను (Gaddar Awards) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారం వరించింది. దీంతో ఆయనకు అభినందనలు చెబుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (pawan Kalyan) పోస్ట్ పెట్టారు. ఈ వార్త తనకెంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి (Chiranjeevi) ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. గద్దర్ అవార్డులకు ఎంపికైన ప్రతి ఒక్కరికీ పవన్ శుభాకాంక్షలు తెలిపారు.
దుల్ల కొట్టావ్ నాన్న: నాగార్జున
ఇక ఈ అవార్డు విజేతలకు అగ్ర కథానాయకుడు నాగార్జున (Nagarjuna) కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తన కుమారుడు నాగచైతన్యను ప్రత్యేకంగా అభినందించారు. చైతూ ఉత్తమ నటుడిగా ఎంపికైనందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ‘తండేల్’ సినిమాలో అద్భుతంగా నటించాడని, ఈ అవార్డుకు అతడు అర్హుడని కొనియాడారు. ‘దుల్ల కొడతా నాన్న’ అంటూ తండేల్ డైలాగుకు హార్ట్ ఎమోజీ జోడించి అభినందించారు. తెలంగాణ ప్రభుత్వానికి నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ఏయన్నార్ పేరుతో అవార్డును ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏయన్నార్ అవార్డు జయసుధకు రావడం ఆనందంగా ఉందన్నారు.