ఎంజీఆర్పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
ఇంటర్నెట్డెస్క్: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్ను ప్రస్తావిస్తూ తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటేనని అన్నారు. అయితే, అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కావని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో ఎంజీఆర్పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్ (rajendra prasad comments on mgr) చేశారు. కాంతారావును చూసి ఎంజీఆర్ భయపడేవారని అన్నారు. ఈ కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో తమిళంలో క్షమాపణలు చెబుతూ రాజేంద్రప్రసాద్ వీడియోను విడుదల చేశారు.
‘‘తమిళ సినీ ప్రేక్షకుల మాదిరిగానే నేనూ ఎంజీఆర్ను దైవంలా భావిస్తా. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో నోరుజారాను. అయితే, అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కావు. కొందరు ఈ అంశాన్ని పెద్దది చేశారు. ఆయనపై వ్యాఖ్యలు చేసేంత ధైర్యం నాకుందా? నేను చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో ఉండగా, ఆయన సీఎంగా ఉన్నారు. మేము నటిస్తుంటే వచ్చి చూసేవారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను మాట్లాడగలనా? నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి. భవిష్యత్లో ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయను’’ -రాజేంద్రప్రసాద్
తమిళ నటులు విశాల్, నాజర్లు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. ఎంజీఆర్ గురించి చౌకబారు పోలికతో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడటం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా చేశాయన్నారు. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాలని నటుడు విశాల్ డిమాండ్ చేశారు. దీంతో రాజేంద్రప్రసాద్ ఎంజీఆర్ అభిమానులకు క్షమాపణ చెప్పారు.