ప్రజల హక్కులను లాక్కునే ప్రయత్నాలను అడ్డుకుంటాం: మమతా బెనర్జీ
ఇంటర్నెట్డెస్క్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్)పై తన పోరాటం కొనసాగిస్తానన్న ఆమె.. ప్రజల హక్కులు లాక్కోవడానికి ప్రధాని మోదీ (PM Modi) చేసే ప్రయత్నాలను అడ్డుకుంటానన్నారు. రంజాన్ సందర్భంగా సెంట్రల్ కోల్కతాలో జరిగిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాజపా ఉనికి లేకుండా చేయడం, ఆ పార్టీ నుంచి దేశాన్ని రక్షించడమే తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమన్నారు. ‘సర్’ పేరుతో రాష్ట్రంలోని అనేకమంది ప్రజల పేర్లను తొలగించారన్నారు. దీనిపై ప్రశ్నిస్తూ కులం, వర్గంతో సంబంధం లేకుండా బెంగాల్లోని ప్రజలందరికీ తాను తోడుగా నిలబడ్డానన్నారు. ఈ ‘సర్’పై తన పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ప్రజల హక్కులను లాక్కోవడానికి ప్రధాని చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటానని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని, రాష్ట్రపతి పాలన కూడా విధించాలని చూస్తుందని ఆరోపించారు. అయినా.. వీటన్నింటికీ తాము భయపడేది లేదన్నారు. ఈ సందర్భంగా భాజపాపై మమతా పలు విమర్శలు చేశారు. ఓట్లు చీల్చేందుకు కొందరు ద్రోహులు భాజపా నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ప్రధాని మోదీపై మమతా చేసిన ఆరోపణలను భాజపా తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగబద్ధమైన పదవికి ఆమె అనర్హురాలు అని పేర్కొంది. మోదీ మైనారిటీల వ్యతిరేకి అంటూ మమతా విమర్శలు చేయడంపై భాజపా నేత శిశిర్ బజోరియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయం సీఎంను వెంటాడుతుందని ఎద్దేవా చేశారు.