AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ గ్యాస్ కొరతపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది.
అమరావతి: రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో మళ్ళీ కిరోసిన్ పంపిణీని ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయంగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం పరిణామాలతో గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా రేపటి నుంచి గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో లీటరు చొప్పున కిరోసిన్ను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 2800 కిలో లీటర్ల కిరోసిన్ను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
హర్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన రవాణాపై ప్రభావం పడింది. దీనివల్ల విశాఖపట్నం తీరానికి ఈ నెల 21వ తేదీనే చేరుకోవాల్సిన భారీ గ్యాస్ నౌక ప్రయాణం ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ నౌక ఈ నెల 26వ తేదీన విశాఖకు చేరుకోనుంది. అప్పటి వరకు రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాయి.
గ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఈ స్వల్పకాలిక అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా గ్యాస్ సౌకర్యం తక్కువగా ఉండే మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో కిరోసిన్ పంపిణీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్యాస్ నౌక వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించాలని జిల్లా అధికారులకు సూచనలు అందాయి.