Chinmayi: డబ్బు కోసం ఏదైనా చేస్తారా.. యాష్ దయాళ్ కేసులో ఆర్సీబీపై సింగర్ చిన్మయి ఫైర్
Chinmayi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ తో ఈ మెగా క్యాష్ రిచ్ లీగ్ స్టార్ట్ కానుంది. కాగా, ఐపీఎల్ కి ముందు లైంగిక ఆరోపణలను ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ యష్ దయాళ్ ఎదుర్కొంటున్నాడు. దయాళ్ వ్యక్తిగత సమస్యలతో ఈ సీజన్కు దూరం కానున్నారు. యష్ ప్రస్తుతం ప్రీ-సీజన్ శిక్షణకు కూడా హాజరు కాలేదు.. అయితే, అతని కాంట్రాక్ట్ను మాత్రం ఫ్రాంచైజీ ఇంకా రద్దు చేయకుండా, ఐపీఎల్ 19వ ఎడిషన్ కి దూరమైనట్లు జట్టు డెరెక్టర్ మోబాటో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపూర్లోని ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు యశ్ దయాళ్ కు బెయిల్ నిరాకరించిందని ఆమె పేర్కొన్నారు. సంపన్న వ్యక్తులు ఇలాంటి కేసుల్లో చిక్కుకున్నప్పుడు మీడియా, క్రీడా సంస్థలు వ్యవహరించే తీరును తీవ్రంగా తప్పుబట్టారు. "డబ్బు కోసం కొందరు ఎంతటి విషయాన్నైనా దాచి పెడతారని ఆరోపించింది. ఇది సిగ్గుచేటు అంటూ సింగర్ చిన్మయి తీవ్రస్థాయిలో మండిపడింది.
యష్ దయాళ్ వ్యవహారంపై స్పందించిన ఆర్సీబీ యాజమాన్యం దీనిని కేవలం ఒక "వ్యక్తిగత సమస్య"గా మాత్రమే పరిగణించింది. వాస్తవానికి ఇది న్యాయపరమైన ప్రక్రియలతో ముడిపడి ఉందని చెప్పుకొచ్చింది. దయాల్ ప్రస్తుతానికి జట్టులో లేకపోయినప్పటికీ, అతని కాంట్రాక్ట్ అలాగే కొనసాగుతోంది. న్యాయస్థానం తీర్పు వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత క్రీడా రంగంలో నైతికత, జవాబుదారీతనం, పారదర్శకతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.