YS Sharmila: నా లక్ష్యం జగన్ కాదు: వైఎస్ షర్మిల
YS Sharmila Comments On Jagan: వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. కానీ, తనపై విమర్శలు చేస్తే తాను స్పందించాల్సి వస్తుందని పేర్కొన్నారు. తన లక్ష్యం వైఎస్ జగన్ కాదని, వైసీపీ నేతల వ్యాఖ్యల వల్ల తరచూ వివరణ ఇవ్వాల్సి వస్తోందన్నారు. తాను ఎవరినీ కుక్కలతో పోల్చలేదని స్పష్టం చేశారు.
తమ కుటుంబ ఆస్తుల విషయంలో విజయమ్మ రాసిన ఉత్తరంలోని అంశాలు సుప్రీం తీర్పుతో సమానమని పేర్కొన్నారు. పులివెందుల అరటి రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ బుధవారం ఆమె కడప కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అరటి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగన్ 2024 మార్చి 11న ఎన్నికల ముందు పులివెందులలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ హడావుడిగా ఏర్పాటు చేసి వెళ్లిపోయారని విమర్శించారు. ప్రతి చిన్న విషయానికి వైసీపీ నేతలు తనను లక్ష్యంగా చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆమె మండిపడ్డారు.
ఆస్తుల విషయంలో తాము పదేపదే నిజాలు చెబుతుంటే కొందరు వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల విషయంలో తన తల్లి విజయమ్మ సుప్రీం తీర్పుతో సమానమైన విషయాలను ఉత్తరం ద్వారా విడుదల చేసినా కొందరు వాగుతూనే ఉన్నారని తెలిపారు. విజయమ్మ లెటర్ అందరికీ సుప్రీంకోర్టు తీర్పుతో సమానమేనన్నారు. ఎవరూ ఆస్తుల విషయం మాట్లాడకూడదని చెప్పారు.
అంతకుముందు షర్మిల కడపలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. అరటి పంట సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్లో అరటి ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు పెట్టుబడి కూడా రాక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.