New Airports IN Telangana : ఏపీ, తెలంగాణలకు కేంద్రం శుభవార్త.. అక్కడ కొత్త విమానాశ్రయాలు.. నిర్మాణానికి లైన్ క్లియర్
New Airports IN Telangana : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పనుంది. రెండు రాష్ట్రాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కీలక ప్రకటన చేసింది. ఉడాన్ 2.0లో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భవిష్యత్తులో నిర్మించబోయే కొత్త ఎయిర్పోర్టులపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ఎయిర్స్ట్రిప్లను పూర్తిస్థాయి విమానాశ్రయాలుగా మార్చడంపై ప్రకటన చేశారు.ఆంధ్రప్రదేశ్ పర్యాటకం
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే మరొక కొత్త విమానాశ్రయం రాబోతుందన్నారు. పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద కొత్త విమానాశ్రయం నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అలానే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల ఈ రెండు ప్రాంతాల మధ్య ఎయిర్ కనెక్టివిటీ లభించి.. లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి చెందడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ప్రస్తుతం ఆదిలాబాద్లో ఉన్న ఎయిర్ఫోర్స్ ఎయిర్స్ట్రిప్ రక్షణ శాఖ ఆధీనంలో ఉందన్నారు. అయితే దాని పక్కన ఉన్న అదనపు భూమిని సేకరించి.. త్వరలోనే కొత్త విమానాశ్రయం నిర్మించి సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటితో పాటు హైదరాబాద్ నగరంలోని బేగంపేట ఎయిర్పోర్ట్ రన్వే కింద ట్రాఫిక్ టన్నెల్ నిర్మాణానికి అనుమతి మంజూరైందన్నారు. దీనికి అయ్యే ఖర్చుని తెలంగాణ సర్కార్ భరిస్తే.. తాము పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా ఉడాన్ 2.0 పథకం కోసం రూ.28 వేల కోట్లు కేటాయించగా.. ఆ మొత్తంలో రూ.12 వేల కోట్ల నిధులు కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం కోసం కేటాయించామని పేర్కొన్నారు.
అలానే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్పై కూడా రామ్మోహన్ నాయుడు కీలక అప్డేట్ వెల్లడించారు.. ఈ సంవత్సరం జూన్లో మామునూరు విమానాశ్రయానికి శంకుస్థాపన చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలానే అటు ఏపీలోని భోగాపురం, గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులు తుది దశకు వచ్చాయని.. వేగవంతంగా పనులు సాగుతున్నాయని తెలిపారు.