ఇండియా ఎల్పీజీ దిగుమతులు 46 శాతం డౌన్
ఇరాన్ దాదాపు ఏడేళ్ల తర్వాత షిప్మెంట్లను తిరిగి ప్రారంభించింది. “ప్రపంచ ఎల్పీజీ ఎగుమతుల్లో సుమారు మూడింట ఒక వంతు మిడిల్ ఈస్ట్ గల్ఫ్ నుంచి వచ్చి హార్మూజ్ ద్వారా వెళ్తుంది. పశ్చిమాసియాలో పరిస్థితులు మెరుగైనా, సప్లయ్ చెయిన్లను పునరుద్ధరించడం, లాజిస్టిక్స్ సాధారణ స్థాయికి తీసుకురావడానికి సమయం పడుతుంది. దీని వల్ల అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు సమీప భవిష్యత్తులో గరిష్టాల్లోనే ఉంటాయి” అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ సంస్థ కెప్లర్ ఎనలిస్ట్ నిఖిల్ దూబే తెలిపారు.
ఇండియాకు యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా నుంచి మార్చిలో కేవలం 6.72 లక్షల టన్నులు (మొత్తం దిగుమతుల్లో 55శాతం) మాత్రమే సరఫరా అయ్యింది. ఇది జనవరి నెలతో పోలిస్తే 36శాతం, ఫిబ్రవరి నెలతో పోలిస్తే 40శాతం తగ్గుదల.
అమెరికా మార్చి నెలలో 4.20 లక్షల టన్నులు సరఫరా చేసి అతి పెద్ద సరఫరాదారుగా అవతరించింది. ఇరాన్ 43 వేల టన్నులు సరఫరా చేసింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏమీ లేవు. అర్జెంటీనా, మలేషియా నుంచి కూడా చిన్న మొత్తాల్లో దిగుమతులు జరిగాయి.
కాగా, భారత్ ఎల్పీజీ వినియోగంలో సుమారు 60శాతం దిగుమతులపై ఆధారపడి ఉండటం వల్ల దిగుమతుల్లో ఏర్పడిన లోటు వలన గ్యాస్ కొరత ఏర్పడింది. మార్చి మధ్యలో దేశీయ ఉత్పత్తి 40శాతం పెరిగినా ఈ లోటు పూర్తిగా భర్తీ కాలేదు. ఆయిల్ రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని కిందటి నెలలో ఆయిల్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కానీ, ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్, ఫుడ్, కెమికల్స్, పెట్రోకెమికల్స్ రంగాల నుంచి డిమాండ్ పెరగడంతో ఈ నిర్ణయాన్ని కొంత వరకు వెనక్కి తీసుకునే చాన్స్ ఉంది.