ఎమ్మెల్యే పల్లాను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాడు
జనగామ టౌన్: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సైబర్ నేరస్థుడి చేతిలో మోసపోయారు. ఆయన నుంచి ఓ సైబర్ నేరస్థుడు రూ.లక్ష కొట్టేశాడు. ఈనెల 5న హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డికి ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి.. తాను ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ అంటూ పరిచయం చేసుకున్నాడు. ఓ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యేకు చెప్పాడు. దీనికిగాను ఒక్కొక్కరికి రూ.2500 చెల్లించాలని నమ్మబలికాడు. దీంతో తన నియోజకవర్గంలోని యువతకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సదరు అపరిచిత వ్యక్తికి ఎమ్మెల్యే పల్లా.. రూ.లక్ష ఫోన్ పే చేశారు. ఆ తర్వాత ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీకి ఫోన్ చేసి డబ్బులు వచ్చాయా? అని అడిగారు. డబ్బులు రాలేదని ఆయన సమాధానం చెప్పడంతోపాటు అసలు తాను ఫోన్ చేయలేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే పల్లా.. జూబ్లీహిల్స్ పీఎస్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు.