ఇజ్రాయెల్- పాక్ మధ్య మాటల యుద్ధం
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్లో అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్- పాక్ (Israel-Pakistan) మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగింది. లెబనాన్లో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందంటూ పాక్ (Pakistan) రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన పోస్టు ఈ వివాదానికి కారణం. ఖవాజా వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడింది. అసలేం జరిగిందంటే..
‘ఇజ్రాయెల్ (Israel) మానవాళికి శాపం. ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరుగుతుండగా.. లెబనాన్లో మారణహోమానికి పాల్పడుతోంది. అమాయక పౌరులను ఆ దేశం పొట్టనపెట్టుకుంటుంది. తొలుత గాజా.. ఆ తర్వాత ఇరాన్.. ఇప్పుడు లెబనాన్లో రక్తపాతాన్ని కొనసాగిస్తూనే ఉంది. యూదుల భారాన్ని వదిలించుకునేందుకు పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటుచేసినవారు నరకంలో కాలిపోవాలని ప్రార్థిస్తున్నా’ అని ఖవాజా (Khawaja Asif) ఎక్స్లో పోస్టు పెట్టారు. ఈసందర్భంగా ఇజ్రాయెల్ను క్యాన్సర్ దేశంగా పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై వ్యతిరేకత రావడంతో తాజాగా ఈ పోస్టును తొలగించడం గమనార్హం.
హర్మూజ్ నిర్వహణను కొత్త దశకు తీసుకెళతాం: మొజ్తాబా ఖమేనీ
ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం మండిపడింది. ఇజ్రాయెల్ నాశనం కావాలంటూ.. ఖవాజా పిలుపునివ్వడం అత్యంత దారుణమైన చర్యగా పేర్కొంది. కొనసాగుతోన్న శాంతి చర్చల్లో తటస్థ పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్న దేశం నుంచి ఇలాంటి ప్రకటనలు రావడం సహించరానిదని స్పష్టంచేసింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ కూడా ఖవాజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమ దేశాన్ని క్యాన్సర్తో పోల్చడం.. వారి వినాశనానికి పిలుపునివ్వడమేనని హెచ్చరించారు. అమెరికా- ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీన్ని శాశ్వత శాంతిగా మార్చేందుకు ఇస్లామాబాద్ వేదికగా తదుపరి చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్- పాక్ మధ్య ఈ వివాదం తలెత్తడం గమనార్హం.