భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం.. ప్రధానికి ఆహ్వానం
అమరావతి: విజయనగరం జిల్లాలో నూతనంగా నిర్మించిన భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ప్రధాని మోదీకి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికినట్లు సమాచారం. జులై 5 లేదా 8, ఆగస్టు 17 లేదా 19 తేదీల్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి సమయం ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయ నిర్మాణపనులు త్వరగా పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది.
జూన్ 30 లోపు అన్ని పనులు పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.
మరోవైపు ఆనందపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ అలైన్మెంట్ ఖరారు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రానున్న 45 రోజుల్లో డీపీఆర్ సిద్ధం చేయనున్నట్లు సమాచారం. భోగాపురం విమానాశ్రయ అనుసంధానం కోసం విశాఖ నుంచి డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్కు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. గతంలో మెట్రో కోసం రూపొందించిన డీపీఆర్లో సవరణలు చేసి..
కేంద్రానికి రైట్స్ సంస్థ పంపినట్లు సమాచారం. విమానాశ్రయ అనుసంధాన రోడ్లకు అవసరమైన రక్షణ, అటవీ వన్యప్రాణి శాఖల నుంచి అనుమతుల కోసం ప్రతిపాదనలను రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పంపింది. బీచ్ రోడ్డును 16వ జాతీయ రహదారికి లింక్ చేసేందుకు అలైన్మెంట్ పూర్తి కావడంతో అధికారులు డీపీఆర్పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇమిగ్రేషన్ చెక్ పోస్టు ఏర్పాటుకు అవసరమైన ఇమిగ్రేషన్ స్టేటస్ నోటిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. బోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ‘ ఏవియేషన్ గేట్వే’గా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.