‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే..నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు కిరణ్ అబ్బవరం. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా తన సొంత నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ పై ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమాను నిర్మించాడు.ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(ఏప్రిల్ 17) రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.
ఈ సినిమా కథ 1996 నేపథ్యంలో సాగుతుంది. కుప్పం దగ్గర్లోని తిమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన సతీష్(సాయి తేజ్).. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రతి శివరాత్రికి టీవీ, వీసీఆర్ని రెంట్కి తీసుకొచ్చి సినిమాలు వేస్తుంటాడు. ఆ ఊరికి తొలిసారి టీవీ కొని తీసుకొస్తాడు రాజప్ప(పదీప్ కొట్టె). రాజప్ప చెల్లెలు శారద(వేద జలంధర్)కు సతీష్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ప్రేమలో ఉంటారు. అది రాజప్పకు నచ్చదు. ఓ రోజు టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన సతీష్తో రాజప్ప తండ్రి గొడవకు దిగుతాడు. అదికాస్త పెద్దదై.. రాజప్ప, సతీష్ తీవ్రంగా కొట్టుకుంటారు.
ఆ మరుసటి రోజే.. రాజప్ప ఇంట్లో ఉన్న టీవీని ఎవరో ఎత్తుకెళ్లిపోతారు. సతీషే ఆ టీవీని దొంగతనం చేశాడంటూ రాజప్ప పంచాయితీ పెడతాడు. ఊరంతా సతీష్ని దొంగ అంటుంది. రెండు వారల్లో టీవీ దొంగతనం చేసినవాళ్లను కనిపెట్టి, పంచాయితీ ముందు నిలపెడతానని సతీష్ సవాల్ చేస్తాడు. అసలు ఆ టీవీని దొంగతనం చేసిందెవరు? ఎందుకు చేశారు? తనపై పడ్డ నిందను పోగొట్టుకునేందుకు సతీష్ ఏం చేశాడు? సతీష్-శారదల ప్రేమ ఏమైంది? సిద్దు(లతీష్ కీలపట్టు) వల్ల సతీష్కి ఎదురైన సమస్యలు ఏంటి? టీవీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? చివరకు సతీష్ -శారదలు ఒకటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.