రివ్యూ: మట్కా కింగ్.. విజయ్ వర్మ వెబ్సిరీస్ మెప్పించిందా?
Matka King review || వెబ్సిరీస్: మట్కా కింగ్; నటీనటులు: విజయ్ వర్మ, సాయి తమంకర్, భూపేంద్ర జాదావత్, కృతిక కర్మ, గుల్షన్ గ్రోవర్, సిద్ధార్థ్ జాదవ్, జైమీ లీవర్ తదితరులు; దర్శకత్వం: నాగరాజ్ మంజులే; స్ట్రీమింగ్ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో నటుడు విజయ్ వర్మ కీలక పాత్రలో రూపొందిన పీరియాడిక్ వెబ్సిరీస్ ‘మట్కా కింగ్’. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? కథేంటంటే.. ముంబయి కాటన్ మిల్లు యజమాని, మట్కా నిర్వాహకుడు లాల్జీ భాయ్ (గుల్షన్ గ్రోవర్) వద్ద మేనేజర్గా పనిచేస్తుంటాడు బ్రిజ్ భట్టి (విజయ్ వర్మ). తమ్ముడు లక్ష్మణ్ (భూపేంద్ర జాదవ్) విలాసాలకు అప్పులు చేస్తాడు.
అప్పు ఇచ్చిన వ్యక్తి రౌడీలతో ఇంటికి వచ్చి లక్ష్మణ్పై దాడి చేయడంతో ఆ డబ్బులు తాను తిరిగి ఇస్తానని బ్రిజ్ చెబుతాడు. అందుకు 10 రోజుల సమయం కోరతాడు. తాను పనిచేస్తున్న లాల్జీ దగ్గరకు వెళ్లి సాయం కోరగా, అందుకు అతడు నిరాకరిస్తాడు. దీంతో అతడికి పోటీగా బ్రిజ్ భట్టి మట్కా నిర్వహణకు దిగుతాడు. బ్రిజ్కు మట్కా వ్యాపార ప్రయాణంలో దగ్డు (సిద్ధార్థ్ జాదవ్), గుల్రుక్ (కృతిక కర్మ) అండగా నిలబడతారు. అలా మట్కా నిర్వహణతో మొదలైన బ్రిజ్ భట్టి జీవితం ఎలా సాగింది? ఎలాంటి మలుపులు తిరిగింది. స్థానిక వ్యవస్థలను సైతం శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో అతడికి శత్రువులుగా మారింది ఎవరు? అన్నది సిరీస్ కథాంశం.
ఎలా ఉందంటే.. నిజ జీవిత సంఘటనలు, వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొంది సినిమాలు, వెబ్సిరీస్లను తీయడం కొత్తేమీ కాదు. ముంబయిలోని పత్తి వ్యాపారి రవి ఖత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగరాజ్ మంజులె ‘మట్కా కింగ్’ను తీర్చిదిద్దారు. ఇలాంటి కథలను ఎంచుకున్నప్పుడు అందులో వాస్తవికతతో పాటు, కాస్త ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తుంటారు. ఈ సిరీస్ విషయంలో దర్శకుడు వాస్తవికతకే పెద్దపీట వేయడంతో సిరీస్ ఆసాంతం ఓ మెలో డ్రామాగా సాగుతుంది.
ఊహించని మలుపులు, ఉత్కంఠరేపే సన్నివేశాలు పెద్దగా ఉండవు. ఒక మధ్యతరగతి వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగడం స్ఫూర్తినింపే కథే అయినా, ఆ ప్రయాణం ఎలా సాగిందన్న దానిపై చిత్ర/సిరీస్ విజయం ఆధారపడి ఉంటుంది. ‘మట్కా కింగ్’లో అలాంటి మెరుపులు పెద్దగా కనిపించవు. దీంతో సిరీస్ కూడా సాదాసీదాగా సాగుతుంది. 1960-70వ దశకంలో నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ సిరీస్ను ప్రారంభించిన తీరు బాగుంది. అప్పట్లో చాలా రాష్ట్రాల్లో జూదం, మట్కా వంటి వాటిని నిబంధనల మేరకు అధికారికంగానే నిర్వహించేవారు.