అధ్యక్షుడిని పక్కనపెట్టి.. ఖమేనీ చుట్టూ వలయంగా ఏర్పడి..!
Iran-IRGC| ఇంటర్నెట్డెస్క్: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆయతుల్లా ఖమేనీ మృతి చెందగా.. ఆయన కుమారుడు, కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో యుద్ధరంగంలో పోరాడుతోన్న ఇరాన్ను ఎవరు నడిపిస్తున్నారనే ప్రశ్న ఎదురవుతోంది. ఆ దేశానికి అధ్యక్షుడిగా పెజెష్కియాన్ ఉన్నా.. ఆయన చేతుల్లో అధికారంలో లేదని తెలుస్తోంది. అత్యంత శక్తిమంతమైన ఐఆర్జీసీ (Islamic Revolutionary Guard Corps)నే పాలన మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్లో పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఐఆర్జీసీ నియంత్రిస్తోందట.
అధ్యక్షుడు పెజెష్కియాన్ చేపట్టిన నియామకాలను ఐఆర్జీసీ అడ్డుకుంటోందని ఆ కథనాలు రాసుకొచ్చాయి. ఐఆర్జీసీ మేజర్ జనరల్ అహ్మద్ వహీద్ ఒత్తిడి కారణంగా నిఘా మంత్రిని నియమించేందుకు అధ్యక్షుడు చేసిన ప్రయత్నం విఫలమైందని పేర్కొన్నాయి. యుద్ధ సమయంలో అన్ని కీలక పదవులకు వ్యక్తులను తామే నిర్ణయిస్తామని వహీద్ పట్టుబడుతున్నారని వెల్లడించాయి. దీంతో ఇరువర్గాల మధ్య రాజకీయ ప్రతిష్ఠంభన నెలకొందని తెలిపాయి. దీంతోపాటు మొజ్తాబా ఖమేనీ చుట్టూ ఈ సైనిక వ్యవస్థ (IRGC) ఒక వలయంలా ఏర్పడిందనే వార్తలు స్థానికంగా కలవరానికి గురిచేస్తున్నాయి. ఖమేనీని కలిసే మార్గాన్ని కూడా వీరు నియంత్రిస్తున్నారట. రణమా..
విరమణా?..అమెరికా, ఇరాన్ దారెటు? ఖమేనీకి చేరాల్సిన ప్రభుత్వ నివేదికల విషయంలోనూ ఐఆర్జీసీ తన పట్టు ప్రదర్శిస్తోందని, ఎన్నికైన ప్రభుత్వం నుంచి ఆయన్ను ఏకాకిని చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. పెజెష్కియాన్ అత్యవసర సమావేశం కోసం ప్రయత్నించినా.. అది సాధ్యం కాలేదని సమాచారం. అయితే ఈ పరిణామాలను ఆకస్మిక స్వాధీనంగా చూడొద్దని, ఇదొక తిరుగుబాటు అని భావించడం కూడా తప్పే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ అధికారిక స్వరూపంలో క్రమంగా జరుగుతోన్న మార్పు అని పేర్కొన్నారు. అయితే అతివాదుల నాయకత్వంలోని ఐఆర్జీసీ విదేశాంగ విధానంలో కఠినవైఖరి అవలంబించొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో చర్చల్లో పట్టువిడుపులు ప్రదర్శించకపోవచ్చని, సైనిక ఘర్షణలకే మొగ్గుచూపొచ్చనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అదే జరిగితే యుద్ధం ముగింపు ఛాయలు ఇప్పట్లో ఉండకపోవచ్చు..!