Fahadh Faasil: మలయాళ మేకర్స్ ఆలోచన.. బయటపెట్టిన తెలుగు నిర్మాత
ఏ వ్యాపారం అయినా లాభాల సంపాదనే కీలకం. దానికోసమే ప్రతిఒక్కరూ ఆలోచిస్తారు. కొంతమంది మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా సంపాదించాలా అని చూస్తుంటారు. మలయాళ దర్శకనిర్మాతల ఆలోచన ఇప్పుడు అదే. 'పుష్ప' ఫేమ్ ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ ఇదే విషయాన్ని తెలుగు నిర్మాత 'మైత్రీ' రవిశంకర్తో పంచుకోగా.. ఆ విషయాన్ని ఈయన ఇప్పుడు బయటపెట్టారు.
సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన దాసరి జయంతి వేడుకల్లో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఫహద్ చెప్పింది గమనిస్తే నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది మలయాళం వచ్చిన 'లోక' సినిమానే తీసుకుంటే రూ.40 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు. కానీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నెలరోజుల క్రితం రిలీజైన 'వాలా 2' సెన్సేషనల్ సక్సెస్ అయింది. కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ సినిమాకు రూ.200 కోట్లకు పైనే వసూళ్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో మలయాళ మేకర్స్.. తక్కువ బడ్జెట్ పెట్టి 'బాహుబలి' రేంజ్ కలెక్షన్స్ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒకప్పటితో పోలిస్తే మలయాళ సినిమాలపై జనాల్లో అభిప్రాయం మారింది. థియేటర్లలో వీలుకానప్పటికీ ఓటీటీల్లోకి వచ్చిన తర్వాత వాటిని ఎగబడి చూస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులైతే కొన్ని మలయాళ మూవీస్కి ఓటీటీల్లో బ్రహ్మరథం పడుతున్నారు! ఫహద్ ఫాజిల్ చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా టాలీవుడ్లో జరుగుతూ ఉంటుంది. వేల కోట్ల కలెక్షన్స్ కావాలంటే వందల కోట్లు ఖర్చు పెట్టాలనే ఆలోచన ఫిక్సయిపోయింది. తీరా చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా కొన్ని సినిమాలు రాబట్టుకోలేకపోతున్నాయి. స్టార్ డైరెక్టర్స్ సినిమాలకు వందల కోట్లు బడ్జెట్ పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న కొందరు యువ దర్శకులు సైతం రూ.100 కోట్లకు పైనే నిర్మాతలతో ఖర్చు పెట్టించేస్తున్నారు. ఈ విషయమే చాలామంది నిర్మాతలని భయపెట్టేస్తోంది! ఫహద్ ఆలోచిస్తున్నట్లు మన దర్శకనిర్మాతలు కూడా ఆలోచిస్తే బాగుంటుంది! ఒకవేళ ఆలోచించినా ఇది సాధ్యమవుతుందా అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న!