Select Location
All Locations
State
Region
City / District
Sanjay Mehrotra: చైనా వెళ్లిన ట్రంప్ బృందంలో భార‌తీయ వ్యాపార‌వేత్త‌.. ఎవ‌రీ సంజ‌య్ మెహ్రోత్రా ?

Sanjay Mehrotra: చైనా వెళ్లిన ట్రంప్ బృందంలో భార‌తీయ వ్యాపార‌వేత్త‌.. ఎవ‌రీ సంజ‌య్ మెహ్రోత్రా ?

బీజింగ్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. డ్రాగ‌న్ దేశం చైనాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న‌తో పాటు అనేక మంది ఆ దేశ కంపెనీల సీఈవోలు ఉన్నారు. ట్రంప్‌తో చైనా విజిట్‌కు వెళ్లిన వారిలో ఓ భార‌తీయ సంత‌తి వ్యాపారి ఉన్నారు. ఇండియాలో జ‌న్మించిన సంజ‌య్ మెహ్రోత్రా(Sanjay Mehrotra) ఆ టీమ్‌లో ఉన్నారు. సెమీకండ‌క్ట‌ర్‌ ప‌రిశ్ర‌మ‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఆయ‌న‌కు గుర్తింపు ఉన్న‌ది. హై ప్రొఫైల్ కార్పొరేట్ వ్య‌క్తుల్లో ఈయ‌న ఒక‌రు. శ‌క్తివంత‌మైన అమెరికా వ్యాపార‌వేత్త‌లు టిమ్ కుక్‌, ఎలాన్ మస్క్‌, లారీ ఫింక్‌, జేన్ ఫ్రేజ‌ర్‌తో క‌లిసి మెహ్రోత్రా వెళ్లారు.

1958లో మెహ్రోత్రా కాన్పూర్‌లో జ‌న్మించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెమీకండ‌క్ట‌ర్ ప‌రిశ్ర‌మ‌లో ఈయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది. మైక్రాన్ టెక్నాల‌జీలో సీఈవోగా ఉన్నారు. మెమోరీ చిప్స్ త‌యారీలో ఆ కంపెనీ అగ్ర‌స్థానంలో ఉంది. 2017లో ఆయ‌న మైక్రాన్ కంపెనీలో సీఈవోగా చేరారు. శాన్‌డిస్క్ కంపెనీ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడిగా ఉన్నారు. అయితే ఆ కంపెనీని వెస్ట్ర‌న్ డిజిట‌ల్ కంపెనీ టేకోవ‌ర్ చేసుకున్న విష‌యం తెలిసిందే. ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిల‌ర్స్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ చ‌దివారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివారు. స్టాన్‌ఫ‌ర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో కూడా ఆయ‌న ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కోర్సు చేశారు.

నాలుగు ద‌శాబ్ధాలుగా ఆయ‌న చిప్ త‌యారీ కెరీర్‌లో ఉన్నారు. ఇంటెల్‌, ఇంటిగ్రేటెడ్ డివైస్ టెక్నాల‌జీ అండ్ ఎస్ఈఈక్యూ టెక్నాల‌జీ కంపెనీల్లో మెహ్రోత్రా ప‌నిచేశారు. అయితే అమెరికా, చైనా మ‌ధ్య జ‌రుగుతున్న చిప్ వార్‌లో మైక్రాన్ కంపెనీ కూడా ఉన్న‌ది. రాజ‌కీయ‌, సామాజిక‌, ఆర్థిక వైరుధ్యం నేప‌థ్యంలో మెహ్రోతా చైనా ప‌ర్య‌ట‌న కీల‌కం కానున్న‌ది. అమెరికా, చైనా కంపెనీలు వ్యూహాత్మ‌కంగా అడ్వాన్స‌డ్ చిప్ త‌యారీపై దృష్టి పెట్టాయి. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, టెక్నాల‌జీ స‌ప్ల‌య్ చెయిన్స్ పైన కూడా రెండు దేశాలు పోటీప‌డుతున్నాయి.

అమెరికా ప్ర‌భుత్వం నుంచి సెమీకండ‌క్ట‌ర్‌ ప‌రిశ్ర‌మ‌ల్లో మైక్రాన్‌కు చాలా వ‌ర‌కు ల‌బ్ధి జ‌రిగింది. చిప్స్ అండ్ సైన్స్ యాక్టు తెచ్చే రీతిలో ఆ కంపెనీ అమెరికా ప్ర‌భుత్వంపై వ‌త్తిడి తేగ‌లిగింది. 2022లో చిప్స్ యాక్ట్ తెచ్చేందుకు స్థానిక నేత‌ల‌తో మైక్రాన్ కంపెనీ లాబీయింగ్ చేసింది. బోయిసి, ఇదాహో, న్యూయార్క్‌లోని సిరాకాజ్ ప్ర‌దేశాల్లో చిప ఉత్ప‌త్తి కేంద్రాల‌ను ప్రారంభించారు. అయితే తొలుత చిప్ టెక్నాల‌జీని ట్రంప్ వ్య‌తిరేకించినా.. ఆ త‌ర్వాత విధాన ఏర్పాటులో కీల‌కంగా మారింది. దీంతో మెహ్రోత్రాకు ప్రాముఖ్య‌త పెరిగింది.


Smacy News 1 hour ago
Home Flash News