ఏమన్నావో నీకు నువ్వే గుర్తు తెచ్చుకో పవన్ కల్యాణ్ : మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి ఏపీ డీప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణపై పవన్ కల్యాణ్ అన్న మాటలను ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఏర్పాటు అయినప్పటినుంచి పవన్ కల్యాణ్ ది ఇదే తీరు అన్నారు. తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేని పవన్ కల్యాణ్.. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ముసలి కన్నీరు కారుస్తున్నారని తెలంగాణ సమాజానికి పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.. భారత రాజ్యాంగం కల్పించిన సౌకర్యాన్నిబట్టి ఎవరైనా, ఎక్కడైనా సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు.
హైదరాబాద్లో ఎవరో సభ పెడితే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ, తెలంగాణ విషయంలో, తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి ఎలా వ్యవహరించాడో, ఏమి మాటలన్నాడో పవన్ కల్యాణ్ ఒకమారు గుర్తు తెచ్చుకోవాలి. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు’ అని ఆయనే స్వయంగా వెల్లడించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ ఆధిపత్య వర్గాలు దశాబ్దాలు దోపిడీ పర్వం సాగించి, అది ఆగిపోవద్దనే కుయుక్తితోనే సమైక్య నినాదం వినిపించారు. తెలంగాణ ఏర్పాటును మొదట్నుంచీ అడ్డుకుంటూ వచ్చారు.