CM Chandrababu: విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా.. సంక్షేమం – అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం
CM Chandrababu: గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం తీవ్ర విధ్వంసాన్ని చవిచూసిందని, వేలాది మందిపై అక్రమ కేసులు నమోదు చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. తనపై కూడా అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ను అడుగడుగునా ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. అయితే ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ధైర్యంగా చెప్పగలమని, చేయలేకపోయిన వాటి గురించి కూడా నిజాయితీగా వివరిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు అందిస్తున్నామని, ‘తల్లి వందనం’ పథకం ద్వారా కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. మహిళల కోసం ‘స్త్రీ శక్తి’ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ‘దీపం’ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లపై సాయం అందిస్తున్నామని చెప్పారు. రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేల వరకు సహాయం చేస్తున్నామని, నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు.