నీట్ ఎగ్జామ్ కు కొత్త రూల్స్ : 15 నిమిషాల అదనపు సమయం
నీట్ రాసే విద్యార్థులకు అలర్ట్. జూన్ 21న జరగనున్న నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్ష కోసం.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక మార్పులను ప్రకటించింది. ఎగ్జామ్ ను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, విద్యార్థులకు అనుకూలంగా మార్చేందుకు ఎన్టీఏ జూన్ 12న కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ ఈసారి ఎగ్జామ్ టైంను 195 నిమిషాలకు పెంచారు. ఎగ్జామ్ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనుంది. ఎగ్జామ్ ప్రారంభానికి ముందు అటెండెన్స్ డాక్యుమెంట్స్ పై సైన్ లు చేయడం, ఇన్విజిలేషన్ లాంఛనాలు పూర్తి చేయడం వంటి పరిపాలనాపరమైన పనుల వల్ల.. విద్యార్థులు తమకు కేటాయించిన రాత సమయాన్ని నష్టపోకూడదనే ఉద్దేశంతో ఎన్టీఏ ఈ అదనపు సమయాన్ని కేటాయించింది. దీనివల్ల అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాయడంపైనే పూర్తిగా దృష్టి పెట్టవచ్చు. ఎగ్జామ్ రోజున విద్యార్థులకు పూర్తి స్పష్టత, సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా తెచ్చిన ఈ కొత్త నిబంధనలను అభ్యర్థులందరూ గమనించాలని ఎన్టీఏ స్పష్టం చేసింది.