క్రౌడ్ ఫండింగ్తో రూ.16 కోట్లు.. చిన్నారి పునర్వికాసం
కర్నూలు: క్రౌడ్ ఫండింగ్తో రూ.16 కోట్ల ఆర్థిక సాయం అందుతుందని తాను కలలో కూడా ఊహించలేదని కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జేఎం సురేశ్కుమార్ పేర్కొన్నారు. గురువారం కర్నూలు వచ్చిన ఆయన తనను కలిసిన విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘నా కుమార్తె పునర్వికశ్రీకి.. కోట్లలో ఒకరికి వచ్చే ఎస్ఎంఏ (స్పైనల్ మస్క్యులర్ అట్రోఫి)- టైప్-1 ఉందని, రెండేళ్లలోపే బిడ్డ చనిపోతుందని వైద్యులు చెప్పడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. పాపకు ఒకటిన్నర సంవత్సరం వయస్సు వచ్చేలోపు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ను చేయాలని సూచించారు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఈ సమయంలో గతేడాది నవంబరు 29న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. పలువురు స్పందించారు. ‘క్రౌడ్ ఫండింగ్’ గురించి మా స్నేహితుడు మంజునాథ్ చౌదరి తెలిపారు.
‘ఇంపాక్ట్ గురు’ ప్రతినిధులను కలిసి క్రౌడ్ ఫండింగ్ కోసం ప్రచారం మొదలుపెడితే ఎంతోకొంత ఆర్థికసాయం అందే అవకాశం ఉందని వివరించారు. దీంతో గతేడాది నవంబరు 17న ‘ఇంపాక్ట్ గురు’ వేదికగా క్రౌడ్ ఫండింగ్ కోసం ప్రచారం మొదలుపెట్టాం. వ్యక్తిగతంగా చేస్తున్న ప్రచారాలు, క్రౌడ్ ఫండింగ్ ప్రతినిధులు ఆన్లైన్లో చేపట్టిన ప్రచారాలతో సామాజిక మాధ్యమాలు ఉపయోగించే చాలామందికి నా కుమార్తె దుస్థితి తెలిసింది. దీంతో కనీసం నా ముఖం చూడకుండానే, నన్ను కలవకుండానే నాకు సాయం చేయడానికి చాలా మంది కష్టపడ్డారు. దుబాయ్, కువైట్ల నుంచి కూడా పలువురు సాయం చేశారు. లక్షలాది మంది స్పందించడంతో భారీఎత్తున విరాళాలు అందాయి. అత్యధిక విరాళం గత 20 రోజుల వ్యవధిలోనే అందింది.
మేము చేసిన ప్రయత్నాల కారణంగా రూ.పది కోట్ల వరకు విరాళాలు అందాయి. అంత మొత్తం అందినా మరో రూ.6 కోట్లు ఎప్పటికి అందుతుందోనని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మంత్రి లోకేశ్ భారీ సాయం ప్రకటించారు. మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చే బాధ్యత తనదని అధికారికంగా ప్రకటించడంతో మా ఆనందానికి అవధుల్లేవు. దీంతో ఇకపై ఎవరూ ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం లేదని అభ్యర్థిస్తూ వీడియోను కూడా విడుదల చేశా. కొందరు నాకుమార్తె పేరుతో ఇంకా విరాళాలు సేకరిస్తున్నారని తెలిసింది. నా కుమార్తె పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి వారి సొంతానికి వినియోగించుకుంటున్నట్లు సమాచారం వచ్చింది. ఆయా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని సురేశ్ పేర్కొన్నారు.