ఆంధ్రప్రదేశ్ ను తెలుగునాడుగా మార్చాలి... రాష్ట్రం పేరులోనే తెలుగుదనం లేదు: గరికపాటి
ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలని డిమాండ్ చేశారు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుగుదనం లేదని.. ఏపీ పేరును ఎన్టీఆర్ కోరుకున్నట్లుగా తెలుగునాడుగా మార్చాలని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రం పేరు మార్చుకున్న క్రమంలో ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు గరికపాటి. కేరళ వాళ్ళ తరహాలోనే మన రాష్ట్ర ప్రజలు కూడా పట్టుదలగా వ్యవహరించి రాష్ట్రం పేరు మార్చుకుంటే మన బతుకులు కూడా మారతాయని అన్నారు గరికపాటి.
కేరళ రాష్ట్రం పేరును కేరళం గా మార్చడానికి ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రాష్ట్రం పేరు మార్చే అంశంపై కేరళ అసెంబ్లీలో ఇప్పటికే పలు తీర్మానాలు చేయగా.. ఇటీవలే ఆ తీర్మానానికి కేరళ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అందుకు కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. ఇప్పుడు కేరళ బాటలోనే ఏపీలో కూడా రాష్ట్రం పేరు మార్చాలన్న వాదన మొదలైంది. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కూడా అదే డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
కేరళ ప్రజలకున్న రాష్ట్రాభిమానం, భాషాభిమానం మనకు లేదని.. ఇటీవల కేరళ రాష్ట్రం పేరును కేరళం మార్చారు.. మన ఆంధ్రప్రదేశ్ పేరు కూడా తెలుగునాడుగా మార్చాలని అన్నారు గరికపాటి. ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగా ఏపీ పేరును తెలుగునాడుగా మార్చాలని అన్నారు. అప్పుడే మనకు జాతీయాభిమానం ఉంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదని..ఈ విషయం చెప్పడానికి తనకు మొహమాటం లేదని అన్నారు. అమలాపురంలో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు గరికపాటి.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఎంతో ఆంధ్రప్రదేశ్ కూడా అంతేనని అన్నారు గరికపాటి. మన రాష్ట్రం పేరు కూడా తమిళనాడు లాగా.. తెలుగునాడు అని మార్చాలని డిమాండ్ చేశారు గరికపాటి. కేరళ ప్రజలకున్న పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరే కాకుండా మన బతుకులు కూడా మారతాయని అన్నారు గరికపాటి.