Hyderabad: సాగర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం.. డీసీఎంను ఢీకొట్టి..
Hyderabad: నగరంలోని ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్పై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు అతివేగంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. అదుపుతప్పిన కారు ముందు వెళ్తున్న డీసీఎం (DCM) వ్యాన్ను బలంగా ఢీకొట్టింది. డీసీఎంను ఢీకొట్టిన ధాటికి కారు ఫ్లైఓవర్ డివైడర్ను బలంగా తాకింది. దీంతో ఇంజిన్ భాగంలో నిప్పురవ్వలు చెలరేగి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే కారు మొత్తం మంటల్లో చిక్కుకుంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేలోపే కారు పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయింది.
కారులో ఉన్న యువకులు అప్రమత్తమై మంటలు వ్యాపించే లోపే బయటకు దూకేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనలో వారు తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఫ్లైఓవర్పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదానికి మితిమీరిన వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. కారులోని యువకులు మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, కారును క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.