మారిన ‘పది’ పరీక్షల విధానం
పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో ప్రభుత్వం ఈసారి మార్పులు తీసుకువచ్చింది. మారిన విధానం ప్రకారం విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.
వాంకిడి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో ప్రభుత్వం ఈసారి మార్పులు తీసుకువచ్చింది. మారిన విధానం ప్రకారం విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది వరకు వార్షిక పరీక్షలు ఆదివారాలు మినహాయించి వరుసగా నిర్వహించేవారు. ఒక్కో పరీక్షకు మధ్యలో గడువు ఉండేది కాదు. ప్రస్తుతం మారిన విధానం ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు కొసాగుతాయి. పరీక్షకు మధ్య గ్యాప్తో విద్యార్థులు బాగా చదివి పరీక్షలకు సిద్ధమై మంచిమార్కులు సాధించాలన్న లక్ష్యంతో ఈ విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రీఫైనల్ పరీక్షలు ముగియడంతో ప్రత్యేక కార్యాచణ ప్రకారం విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రీ ఫైనల్ పరీక్షల సమాధాన పత్రాలను దిద్ది వాటిని తల్లిదండ్రులకు పంపించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎక్కడ వెనుకబడి ఉన్నారో, ఎక్కడ తప్పులు రాస్తున్నారో ఉపాధ్యాయులు గుర్తించి సరైన సమాధానాలు రాసేలా చూడాలి. ఈ పరీక్షల ఆధారంగా విద్యార్థులను మూడు గ్రేడ్లుగా తయారు చేసి వారిలో సామర్థ్యాలు పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి. పాస్ అయ్యే అవకాశం తక్కువ ఉన్న వారు, యావరేజ్ మార్కులు తెచ్చుకునే వారు, మంచి మార్కులు సాధించేవారు అనే గ్రేడ్లుగా విభజించాలి. గ్రేడ్ల వారీగా వారికి బోధించాలి. దీనిలో భాగంగా ప్రతిరోజూ సబ్జెక్ టీచర్లు విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో పాటు పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన పాఠ్యాంశాలను వివరించి ఐదారు ముఖ్యమైన ప్రశ్నలతో స్లిప్ టెస్ట్లు ప్రతిరోజూ నిర్వహించాలి.