ఇరాన్పై దాడి కోసం భారత పోర్టులను అమెరికా వాడుతోందా? ఫ్యాక్ట్ చెక్ చేసిన కేంద్రం
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆందోళనను కలిగిస్తోంది. ఇరాన్పై దాడి కోసం భారత పోర్టులను అమెరికా వినియోగించుకుంటోందని అగ్రరాజ్య మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యలు చేశారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అవన్నీ నిరాధార వార్తలంటూ కేంద్ర విదేశాంగ శాఖ (MEA FactCheck) ‘ఫ్యాక్ట్చెక్’లో వెల్లడించింది.
యూఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మెక్గ్రెగొర్ అమెరికాలోని ఓ మీడియా ఛానల్లో మాట్లాడుతూ.. తమ బేస్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. అందుకే సమీపంలోని భారత నేవీ బేస్లను అమెరికా (USA) ఉపయోగించుకోవాల్సి వస్తోందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ భారత విదేశాంగ ఫ్యాక్ట్చెక్ ఎక్స్లో పోస్టు చేసింది. ‘‘ఇవన్నీ తప్పుడు, నకిలీ ఆరోపణలు మాత్రమే. ఇలాంటి కల్పిత, నిరాధార వ్యాఖ్యలను నమ్మొద్దని హెచ్చరిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది.
హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక (Iran Warship)పై దాడి జరిగిన వేళ ఈ అసత్య ప్రచారం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా-75పై అమెరికా జలాంతర్గామితో దాడి చేసి ముంచేసిన సంగతి తెలిసిందే. దాడి సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో కొంతమందిని శ్రీలంక దళాలు రక్షించగా.. 87 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నౌక విశాఖపట్నం నుంచి వెళ్తుండగా శ్రీలంక తీరంలో దాడి జరిగింది.